కాంగ్రెస్ వెయ్యి రోజుల విఫల పాలనపై బీఆర్‌ఎస్ భారీ ధర్నా

-నానక్‌రామ్‌గూడలో బాకీ కార్డుల పంపిణీ.. హామీలు అమలు చేయాలని డిమాండ్ -ముఖ్యఅతిథిగా ఎమ్మెల్సీ శేంబిపూర్ రాజు
🖨️ Print

శేరిలింగంపల్లి, సెప్టెంబర్ 2 (అక్షర ఆయుధం న్యూస్ ప్రతినిధి కృష్ణ): కాంగ్రెస్ ప్రభుత్వ వెయ్యి రోజుల విఫల పాలనను నిరసిస్తూ శేరిలింగంపల్లి నియోజకవర్గంలోని గచ్చిబౌలి డివిజన్ నానక్‌రామ్‌గూడలో బీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో భారీ నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజలకు ప్రభుత్వం చెల్లించాల్సిన బకాయిల వివరాలతో కూడిన బాకీ కార్డులను పంపిణీ చేశారు. బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు పిలుపు మేరకు, కూకట్‌పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు సూచనల మేరకు, గచ్చిబౌలి డివిజన్ మాజీ కార్పొరేటర్ కొమిరిశెట్టి సాయిబాబా నాయకత్వంలో ఈ కార్యక్రమం జరిగింది. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు హాజరై కాంగ్రెస్ ప్రభుత్వ పాలనపై విమర్శలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. రైతులు, మహిళలు, యువతతో పాటు వివిధ వర్గాలకు ప్రకటించిన హామీల అమలులో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. ప్రజలకు రావాల్సిన బకాయిలను వెంటనే చెల్లించి, పెండింగ్‌లో ఉన్న ప్రజా సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో బీఆర్‌ఎస్ సీనియర్ నాయకుడు మారబోయిన రవి యాదవ్, మాజీ కార్పొరేటర్లు బొబ్బ నవతారెడ్డి, రంగారావు తదితరులు పాల్గొని నిరసనకు సంఘీభావం తెలిపారు. ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని రావలసిన బకాయిలను వెంటనే చెల్లించాలని ప్రజా సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలని నినాదాలు చేశారు ప్రజల పక్షాన టిఆర్ఎస్ పోరాటం నిరంతరం కొనసాగుతుందని నాయకులు స్పష్టం చేశారు. శేరిలింగంపల్లి నియోజకవర్గానికి చెందిన బీఆర్‌ఎస్ సీనియర్ నాయకుడు మిద్దెల మల్లారెడ్డి, పార్టీ నాయకులు, కార్యకర్తలు, మహిళా నాయకులు, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *