
అక్షరాయుధం ప్రతినిధి శ్రీనివాసరావు బూర్గంపహాడ్ , సెప్టెంబర్ 2 ఎల్నినో ప్రభావంతో వాతావరణ పరిస్థితుల్లో మార్పులు చోటుచేసుకుంటున్న నేపథ్యంలో ప్రత్యామ్నాయ పంటల సాగును ప్రోత్సహించేందుకు వ్యవసాయ శాఖ చర్యలు చేపడుతోంది. ఇందులో భాగంగా బూర్గంపహాడ్ మండల కేంద్రంలో వ్యవసాయ సాంకేతిక యాజమాన్య సంస్థ సౌజన్యంతో బెండ పంటను సాగు చేస్తున్న భజన పెద్ద నాగం పంట క్షేత్రాన్ని వ్యవసాయ శాఖ అధికారులు సందర్శించారు.
పంట క్షేత్రాన్ని పరిశీలించిన అధికారులు బెండ సాగు విధానం, పంట పరిస్థితి, రైతుకు అవసరమైన పోషక ఎరువుల వినియోగంపై వివరాలను తెలుసుకున్నారు. అనంతరం ఏటీఎం ఏ సౌజన్యంతో రైతుకు అవసరమైన సూక్ష్మ ఎరువులతో పాటు జింక్, నానో యూరియా, నానో డిఏపి లను అందజేశారు. వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా ప్రత్యామ్నాయ పంటలను సాగు చేయడం ద్వారా రైతులు పంటల వైవిధ్యాన్ని పెంచుకోవడంతో పాటు వ్యవసాయంలో మెరుగైన ఫలితాలు సాధించవచ్చని అధికారులు తెలిపారు.ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి శంకర్, ఏ ఈ ఓలు శృతి, వైష్ణవి, పవన్ కుమార్, రైతులు లక్ష్మారెడ్డి, మారం శ్రీనివాస్ రెడ్డి, గాదె నర్సిరెడ్డి, నందిపాటి రాములు, బిజ్జం వెంకట్రామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.