నాణ్యమైన విద్యుత్‌ సరఫరానే లక్ష్యం..

-అధికారులు సరఫరాల్లో అంతరాయం లేకుండా అప్రమత్తంగా ఉండాలి.. -సబ్‌స్టేషన్‌ వెంటనే వినియోగం చేయాలని ఆధేశం -సీఎండీ వరుణ్‌రెడ్డి

పెద్దవంగర,మహబూబాబాద్ జిల్లా,సెప్టెంబర్02 (అక్షరఆయుధం):నాణ్యమైన విద్యుత్‌ సరఫరాలను వినియోగదారులకు అందించడమే లక్ష్యమని ఎన్పీడీసీఎల్‌ చైర్మన్‌,మేనేజింగ్‌ డైరెక్టర్‌(సీఎండీ) కర్నాటి వరుణ్‌రెడ్డి అన్నారు.బుధవారం మండల కేంద్రంలో నూతనంగా నిర్మాణం చేపడుతున్న సబ్‌ స్టేషన్‌ పనులను ఆయన పరిశీలించి మాట్లాడారు. నిర్మాణ పనులను నాణ్యతతో వెంటనే పనులను పూర్తి చేసి వినియోగంలోకి తీసుకురావాలని ఆధేశించారు.విద్యుత్‌ సరఫరాల్లో ఎలాంటి అంతరాయం లేకుండా క్షేత్రస్థాయిలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని,వ్యవసాయ రంగానికి నిరంతర అంతరాయం లేకుండా విద్యుత్‌ను సరఫరా చేయాలని సూచించారు.కొత్తగా నిర్మాణం చేపట్టిన సబ్‌ స్టేషన్‌తో వడ్డెకొత్తపల్లి,పోచంపల్లి సబ్‌స్టేషన్‌లపై విద్యుత్‌ లోడు భారం తగ్గుతుందన్నారు.రైతులు వ్యవసాయ బోర్లకు తప్పకుండా ప్రభుత్వ అనుమతులు పొందాలని,ఇంటి అవసరాలకు ప్రభుత్వం అందిస్తున్న గృహజ్యోతి పథకాన్ని(జీరో బిల్లు)ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని కోరారు. ప్రమాదాలు జరగకుండా విద్యుత్‌ సిబ్బంది సేఫ్టీ కిట్లను వాడుతూ గ్రామాలలో విద్యుత్‌ ప్రమాదాలు జరగకుండా అవగాహన కల్పించాలని కోరారు.ఈ కార్యక్రమంలో ఎస్ఈ దర్శనం,డివిజనల్‌ ఇంజనీర్‌, సేఫ్టీ ఆఫీసర్‌ హీరోలాల్‌,డీఈ సునీత,ఏఈ రమేష్‌బాబు,విద్యుత్ శాఖ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.